శ్రీశైల మహాక్షేత్రాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు.
ఈ మేరకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తున్నామని చెప్పారు. క్షేత్రాభివృద్ధికి స్థానిక సత్రాల నిర్వాహకులు సహకరించాలని ఆయన కోరారు.
శనివారం పరిపాలనా భవనంలో నిర్వహించిన సమావేశంలో స్థానిక సత్రాల నిర్వాహకులతో ఈవో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా భక్తులకు సేవాభావంతో మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా సత్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి, భక్తులకు ఉచితంగా మంచినీరు, మజ్జిగ అందించాలన్నారు. సత్ర ప్రాంగణాల్లో శుచీశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అన్నదాన కార్యక్రమాల్లో కూడా పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సూచించారు. తాజా కూరగాయల వినియోగం, సిబ్బందికి అవగాహన కల్పించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా ప్రకటించామని, ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడంలో సత్రాల నిర్వాహకులు సహకరించాలని కోరారు. చెత్త నిర్వహణలో తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి అందించాలన్నారు.
అదేవిధంగా సత్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నామస్మరణ ప్రసారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవదాయ చట్టం ప్రకారం నిషేధిత కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ, ప్రజాసంబంధాల విభాగాల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.