శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి 7వ సమావేశం మంగళవారం కార్యాలయ భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించబడింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనగా, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ప్రత్యక్షంగా హాజరయ్యారు.
సమావేశంలో మొత్తం ఆరు అజెండా అంశాలను చర్చించగా, రెండు అంశాలకు ఆమోదం లభించింది. రెండు అంశాలను వాయిదా వేయగా, మరో రెండు అంశాలను తిరస్కరించారు. మిగిలిన 21 అజెండా అంశాలను ఈ నెల 11న జరిగే తదుపరి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.
యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, జూన్ 11న ప్రత్యేక యోగా కార్యక్రమం, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో స్థానికులు, యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాబోయే వర్షాకాలంలో క్షేత్ర పరిధిలో 5 వేల నుంచి 6 వేల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. నీడనిచ్చే మొక్కలతో పాటు దేవతా వృక్షాల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని సభ్యులు సూచించారు. భక్తుల సౌకర్యాల మెరుగుదలకు తిరుమల తరహాలో పిలిగ్రిమ్స్ అమినిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, క్యూకాంప్లెక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అలాగే పారిశుద్ధ్య నిర్వహణను మరింత బలోపేతం చేయాలని సూచించింది. అదేవిధంగా, శ్రీశైలక్షేత్ర దత్తత దేవాలయమైన జ్యోతిస్సిద్ధవటం ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నెలవారీ పారితోషికాన్ని పెంచాలని సమావేశంలో తీర్మానించారు.
Comments
Sign in with Google to comment.