పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆది దంపతులైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శనాలు చేసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం రూ.500 ప్రత్యేక దర్శన టికెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసి, బంగారు వాకిలి ద్వారా దర్శన ఏర్పాట్లు చేసింది. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శీనా నాయక్ దంపతులు కూడా గర్భాలయం వెలుపల నుంచే అమ్మవారిని దర్శించుకుని ముందుకు సాగారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఘాట్ రోడ్, కనకదుర్గానగర్ వైపు వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మరియు ఆర్టీసీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఈ బస్సులు భక్తులతో కిక్కిరిసిపోయి నిరంతరం సేవలందిస్తున్నాయి. పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన అన్ని ఆర్జిత సేవల్లోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు భక్తజన సందోహంతో నిండిపోయి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
Comments
Sign in with Google to comment.