ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో భక్తులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు పూర్తి నగదు రహిత (100% Cashless) విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా డిజిటల్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా శుక్రవారం దేవస్థాన ఇంజినీరింగ్, ఐటీ, కౌంటర్లు, భద్రతా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఈవో, అనంతరం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. వాట్సాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుని దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులు తమ మొబైల్ ఫోన్లలోనే దర్శనం టిక్కెట్లు, సేవా టిక్కెట్లు, లడ్డూ ప్రసాదం టిక్కెట్లు, కేశఖండన టిక్కెట్లు తదితర సేవలను డిజిటల్ చెల్లింపుల ద్వారా సులభంగా పొందవచ్చని తెలిపారు.
ఆన్లైన్, వాట్సాప్ సేవలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు శ్రీ కనకదుర్గ నగర్ మరియు ఘాట్ రోడ్డులోని ‘ఓం’ టర్నింగ్ వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. అక్కడ హై-స్పీడ్ ఇంటర్నెట్, క్యూ ఆర్ కోడ్ స్టాండ్లు, కంప్యూటర్ సిస్టమ్స్ వంటి సాంకేతిక సదుపాయాలు కల్పించాలని ఐటీ విభాగానికి సూచించారు. భక్తులకు మర్యాదపూర్వకంగా సేవలు అందించేందుకు తగిన సిబ్బందిని షిఫ్టుల వారీగా విధుల్లో నియమించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమాదేవి, ఐటీ నిపుణులు, కౌంటర్ల సూపరింటెండెంట్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.