ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనుల షెడ్యూల్లో వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలిక మార్పులు చేసినట్లు ఆర్ అండ్ బీ శాఖ తెలిపింది. దేవాదాయ శాఖ, ఆర్ అండ్ బీ విభాగం సంయుక్తంగా మే 26 నుంచి ప్రారంభించిన ఈ పనులను జూన్ 12 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే విజయవాడలో తీవ్ర ఎండలు, వడగాల్పుల కారణంగా కార్మికులు క్షేత్రస్థాయిలో పనులు చేయడం కష్టతరంగా మారిందని, ఇలాంటి వాతావరణంలో బిటుమిన్, కెమికల్ మిక్సింగ్తో రోడ్డు మరమ్మత్తులు చేపట్టడం సాంకేతికంగా అనుకూలం కాదని ఆర్ అండ్ బీ సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవస్థానం అధికారులకు లేఖ ద్వారా తెలియజేశారు.
అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల రోడ్డుపై మరిన్ని పగుళ్లు వచ్చే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా మరమ్మత్తు పనులు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చిన వెంటనే శాశ్వత ఆధునీకరణ పనుల కొత్త షెడ్యూల్ను ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం భక్తుల వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఘాట్ రోడ్డును తాత్కాలికంగా పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
రేపు మే 29 ఉదయం నుంచి ఘాట్ రోడ్పై వాహనాలను యథావిధిగా అనుమతిస్తామని, భక్తులు మరియు వాహనదారులు సహకరించాలని దేవస్థానం అధికారులు కోరారు.
Comments
Sign in with Google to comment.