శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద వితరణ సేవలను కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు.
పరిపాలనాంశాల సమీక్షలో భాగంగా ఆయన అన్నప్రసాద వితరణ భవనాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా అన్నప్రసాద వితరణ భవనంలోని విరాళాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించిన ఈఓ, అనంతరం అధికారులతో సమావేశమై భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించిన శ్రీనివాసరావు, భోజనం స్వీకరిస్తున్న భక్తులతో నేరుగా మాట్లాడి వడ్డన, రుచి, పరిశుభ్రత వంటి అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.
అన్నప్రసాద వితరణలో శివసేవకుల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా శివసేవకులకు ప్రత్యేక అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి హాల్లో అన్నప్రసాద వితరణ సజావుగా జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. వండిన ప్రతి వంటకం ప్రతి భక్తుడికి అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే అన్ని హాల్స్లో సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. అన్నప్రసాద వంటకాలు రుచికరంగా, నాణ్యంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తాజా కూరగాయలను మాత్రమే వినియోగించాలని సూచించారు. అదేవిధంగా వంటశాల, ప్రసాద వితరణ హాల్స్, భవన ప్రాంగణంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి ఆదేశించారు.
Comments
Sign in with Google to comment.