శ్రీశైల దేవస్థానం లో వేసవి సెలవులు, ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఆదివారం ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు భక్తులతో నిండిపోవడంతో ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన, సౌకర్యాల ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ, భక్తులందరికీ సంతృప్తికరంగా శ్రీస్వామి అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం చేసుకునేలా ఆలయ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి రోజు ఉదయం 6 గంటలకు క్యూ కాంప్లెక్స్లో వేడి పాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈరోజు భక్తులకు అల్పాహారంగా కట్టుపొంగలి, పులిహోర, పెరుగన్నం పంపిణీ చేసినట్లు చెప్పారు. అలాగే మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు నిరంతరం అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి, భక్తులకు చల్లని తాగునీరు, మజ్జిగ అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ప్రాతఃకాల సేవలను నిర్వహించిన అనంతరం ఉదయం 4.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దర్శనాలు కొనసాగించామని తెలిపారు. తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి దర్శనాలు పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ ఉదయం కార్యనిర్వహణాధికారి ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లను పరిశీలించి భక్తులతో నేరుగా మాట్లాడి ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో సేవలు అందిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
Comments
Sign in with Google to comment.