ఆదివారం సెలవు దినం కావడంతో ఇంద్రకీలాద్రి దేవాలయంపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
వేసవి సెలవులు కొనసాగుతుండటంతో తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో సాధారణ భక్తులకు వేగవంతమైన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల VIP దర్శనాలను రద్దు చేశారు. దీంతో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం సులభంగా లభించింది.
వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ సీనా నాయక్ ఆధ్వర్యంలో క్యూ లైన్లలోనే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని భక్తులకు అందించారు.
ఈ ప్రత్యేక ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలయ పరిసరాల్లో ఉచిత ప్రసాదం, అన్నదానం కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ధర్మకర్తల మండలి సభ్యులు క్యూ లైన్లలో పర్యటించి భక్తుల సౌకర్యాలను పరిశీలించారు.
అసిస్టెంట్ కమిషనర్ రంగా రావు, ఇన్చార్జ్ ఈఓతో పాటు ఆలయ సిబ్బంది రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పాలకమండలి, అధికారుల సమన్వయంతో భారీ రద్దీ మధ్య కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Sign in with Google to comment.