ఇంద్రకీలాద్రి పై శుక్రవారం భారీగా భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవులు, శుక్రవారం కావడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో భక్తుల రద్దీ అధికమైంది. తీవ్ర ఎండలను సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఇన్చార్జ్ ఈఓ రంగారావు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
రోజంతా క్యూలైన్లను స్వయంగా పర్యవేక్షిస్తూ భక్తులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. దర్శనం సాఫీగా జరిగేలా అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో సాధారణ భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు వేగంగా దర్శనం లభించింది. వేసవి ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు క్యూలైన్లలో భక్తులకు చల్లని మజ్జిగ, శుద్ధి చేసిన తాగునీటిని నిరంతరాయంగా పంపిణీ చేశారు.
అదేవిధంగా రోజంతా ఉచిత అన్నప్రసాదం, పులిహోర ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. ధర్మకర్తల మండలి సభ్యులు కూడా భక్తుల సేవలో పాల్గొని స్వయంగా నీరు, మజ్జిగ పంపిణీ చేశారు. దేవస్థానం చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Sign in with Google to comment.