న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త, జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆమోదం తెలపడం రాజకీయ దుమారం రేపుతోంది. సుమారు ₹22,006.57 కోట్ల క్లెయిమ్లకు కేవలం ₹6.5 కోట్ల చెల్లింపుతో పరిష్కారం చూపే ప్రణాళికకు అనుమతి లభించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ వ్యవహారం దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో ధనికులు, సామాన్యుల పట్ల వేర్వేరు ప్రమాణాలు ఉన్నాయనే తన ఆరోపణకు నిదర్శనమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ‘‘ఇండియాలో రెండు వ్యవస్థలు ఉన్నాయి’’ అంటూ ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
చిన్న మొత్తాల ఈఎంఐలు చెల్లించడంలో ఆలస్యం చేసిన సామాన్య రుణగ్రహీతలపై బ్యాంకులు ఒత్తిడి తెస్తాయని, అదే సమయంలో భారీ మొత్తాల్లో బకాయిలు ఉన్న సంపన్నులకు పెద్ద మొత్తంలో రాయితీలు లభిస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ధనికులకు ఒక న్యాయం, మిగతా ప్రజలకు మరో న్యాయం అన్నట్లుగా వ్యవస్థ పనిచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
NCLT ఆమోదించిన ప్రణాళిక ప్రకారం సుభాష్ చంద్రకు సంబంధించిన సుమారు ₹22,006.57 కోట్ల అంగీకరించిన క్లెయిమ్లపై రుణదాతలకు కేవలం ₹6.25 కోట్ల చెల్లింపు, మరో ₹25 లక్షలు దివాలా ప్రక్రియ ఖర్చుల కోసం కేటాయించారు. దీంతో రుణదాతల రికవరీ దాదాపు 0.03 శాతానికే పరిమితం కాగా, హెయిర్కట్ సుమారు 99.97 శాతంగా ఉంది.
అయితే ఈ కేసులో ఉన్న క్లెయిమ్లు సుభాష్ చంద్ర వ్యక్తిగతంగా తీసుకున్న ₹22,000 కోట్ల రుణాలు కావని, ఎస్సెల్ గ్రూప్కు చెందిన సంస్థల రుణాలకు ఆయన ఇచ్చిన వ్యక్తిగత హామీలకు సంబంధించినవని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ భారీ హెయిర్కట్పై పలువురు రుణదాతలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, NCLT ప్రణాళికను ఆమోదించింది. ఈ పరిణామం నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ, దివాలా చట్టాల అమలుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది
Comments
Sign in with Google to comment.