సూర్యాపేట: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఓ ట్రావెల్ బస్సు కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 20 మంది వరకు గాయపడ్డారు
. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ట్రావెల్ బస్సు ద్వారకుంట వద్దకు చేరుకోగానే అదుపుతప్పి కంటైనర్ను ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం భారీగా ధ్వంసమైంది. పలువురు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయి తీవ్రంగా ఆర్తనాదాలు చేశారు.
సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను రెస్క్యూ చేసి బయటకు తీసి, అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం కారణంగా హైదరాబాద్–విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
Comments
Sign in with Google to comment.