ఏ విజయేందర్ రెడ్డి : మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మూసీ రివర్ఫ్రంట్ తొలి దశ ప్రాజెక్టు పురోగతిపై విస్తృతంగా చర్చించారు.
మూసీ రివర్బెడ్లో నివసిస్తున్న అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని, భూ సేకరణకు సహకరించే వారికి టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) లేదా నిబంధనల ప్రకారం తగిన పరిహారం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం డిఫెన్స్ భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే నెక్లెస్ రోడ్లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేసి, ప్రాజెక్టు కింద చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రజలకు సమగ్రంగా వివరించడంతో పాటు, ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టును పారదర్శకంగా, ప్రజాహిత దృక్పథంతో, నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు.
Comments
Sign in with Google to comment.