కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం ఉప్పుగూడ, మలక్పేట్ అమృత్ రైల్వే స్టేషన్లలో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను పరిశీలించారు.
ఆయనతో పాటు హైదరాబాద్ డివిజన్ డీఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ, గతి శక్తి చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎల్.ఎస్.ఎస్.రావు, దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ. శ్రీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు. స్టేషన్ భవన నిర్మాణాలు, పార్కింగ్, సర్క్యులేటింగ్ ఏరియా, భద్రతా ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు రూ.5,454 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో రూ.47,984 కోట్ల విలువైన కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, విద్యుదీకరణ, స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గత 12 ఏళ్లలో తెలంగాణలో 347 కి.మీ కొత్త రైల్వే మార్గాలు, 556 కి.మీ డబ్లింగ్/ట్రిప్లింగ్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తుండగా, ఉప్పుగూడ మరియు మలక్పేట్ స్టేషన్లను ఒక్కొక్కటిని రూ.27 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాళ్లు, ర్యాంపులు తదితర ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు
Comments
Sign in with Google to comment.